
- ఆర్మీ 250వ వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించిన అగ్రరాజ్యం
వాషింగ్టన్: అమెరికా ఆర్మీ 250వ వార్షికోత్సవ వేడుకలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ను ఆహ్వానించింది. ఈ వేడుకలు ఈ నెల 14న వాషింగ్టన్ డీసీలో జరగనున్నాయి.ఈ ఆహ్వానం భారత్, -పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించినట్టు పేర్కొన్న సందర్భంలో జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, అసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని పేర్కొంటున్నారు.
భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్పై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే సమయంలో చైనాతో పాకిస్తాన్ కు పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలపై కూడా అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆహ్వానం భారత్ తో పాటు పాకిస్తాన్లోనూ వివాదాస్పదంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ -ఎ- ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.